VM Today News - రాజకీయం / గుంటూరు : సత్తెనపల్లి : తరలివచ్చిన ప్రజల ఆదరణను చూసి నాకు అపారమైన నమ్మకం ఉందని, అంతిమ విజయం జగనన్నదేనని, రాష్ట్రంలో 175 కి 175 సీట్లు గెలుస్తామని జలవనరుల శాఖామాత్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్సార్ సిపీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ 2014లో 926 ఓట్లతో ఓడిపోయానని, అనంతరం 2019 లో నియోజవర్గ ప్రజలు నాపై అభిమానంతో 20,876 ఓట్ల భారీ మెజార్టీతోగెలిపించా రన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో గత మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా నాది నైతిక పరాజయమేనని అంబటి మరోసారి పునరు ద్ఘాటించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐదు సంవత్సరాలుగా ధర్మం బద్దంగా నడుచుకు న్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టలేదని, వేధింపులు, కక్ష సాధింపులు లేని సుపరిపాలను అందించామన్నారు. అందుకే ఈ ఎన్నికలు నా పరిపాలనకు రెఫరండం గా భావిస్తున్నానని స్పష్టం చేశారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు , సంక్షేమ పథకాలు తీసుకుంటున్న అక్క ,చెల్లెమ్మలు అన్ని వర్గాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని భావిస్తున్నారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగనన్న మంచి మెజారిటీతో గెలుస్తారని, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల ఆదరణ చూసిన భరోసాతో పేర్కొంటున్నానన్నారు. నియోజకవర్గంలో కూడా ప్రజలు ప్రేమతో ఆదరించి ఫ్యాను గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నామినేషన్ కార్యక్రమానికి నాలుగు మండలాలు, పట్టణం నుంచి వచ్చిన విశేష ప్రజానీకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రితోపాటు పూర్వ శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డి ,గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ , ఏఎంసీ చైర్మన్ పెండెం బాబురావు పూర్వ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ చిత్త విజయభాస్కర్ రెడ్డి పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, ఇతర ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.
Reporter
VMToday News