VM Today News - వార్తలు / పల్నాడు : మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్లుకు విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర పండుగ హోదా కలిగిన ఈ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట వైపుల నుంచి వచ్చే వాహనాలకు వేర్వేరు పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లు అనుమతించరని స్పష్టం చేశారు. టోల్గేట్ వద్ద నుంచి షటిల్ బస్సుల ద్వారానే భక్తులను కొండపైకి తరలించనున్నారు. ప్రభల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు సూచించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభల నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు తెలిపారు. అశ్లీల నృత్యాలకు అవకాశం లేకుండా ఆర్కెస్ట్రా బృందాలపై కూడా నిఘా ఉంచారు. దొంగతనాలు, వేధింపులు నివారించేందుకు మఫ్టీ సిబ్బందిని నియమించారు. స్నానాల ఘాట్, మెట్ల మార్గంలో పటిష్ట భద్రత కల్పించారు. 200 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిఘా కొనసాగిస్తూ రెండు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Reporter
VMToday News