VM Today News - వార్తలు / గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో సిగరెట్ల విక్రయాలపై అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఆర్పీ మార్పుల పేరుతో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైల్ వ్యాపారుల ప్రకారం హోల్సేల్ దశలోనే ప్యాకెట్కు ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. “మాకు వచ్చిన ధర ఇదే” అంటూ హోల్సేలర్లు సమాధానం ఇస్తున్నారని కిరాణా దుకాణదారులు చెబుతున్నారు. సిగరెట్లు వంటి వేగంగా అమ్ముడయ్యే వస్తువులు లేకపోతే వ్యాపార నష్టం కలగవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెరిగిన రేట్లకే కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించాల్సి వస్తోందని వెల్లడించారు. అదనపు భారం చివరకు సామాన్య ప్రజలపైనే పడుతోంది. కొంతమంది వ్యాపారులు భారీగా స్టాక్ నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లీగల్ మెట్రాలజీ, జీఎస్టీ మరియు సివిల్ సప్లైస్ శాఖలు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సరఫరా గొలుసులో ఎక్కడ లోపం జరుగుతోందో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Reporter
VMToday News