VM Today News - వార్తలు / గుంటూరు : ప్రేమ, అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ భావోద్వేగ ఘటన. ఏకంగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్కు చెందిన ఓ బ్రిటిష్ పౌరుడు నగరానికి రావడం విశేషం. ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాలను పరిశీలిస్తూ ఉండగా, తన ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరిన చార్లెస్ విల్సన్ బెంగళూరు, మద్రాసు ప్రాంతాల్లో సేవలందించారు. అనంతరం సికింద్రాబాద్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా పనిచేస్తూ 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 48 సంవత్సరాలు. తన పూర్వీకుడి సమాధి ఎక్కడుందో తెలుసుకోవాలని రాబిన్ గట్టిగా సంకల్పించారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగించారు. ఈ క్రమంలో స్థానిక జర్నలిస్ట్ రవిరెడ్డి సహకారంతో, ఎనిమిది నెలల క్రితం సికింద్రాబాద్లోని తిరుమలగిరి ‘సెమెట్రీ-12’లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించగలిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాబిన్ తన భార్య లిన్తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కు చేరుకున్నారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి భావోద్వేగంతో నివాళులర్పించారు. “ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను” అని రాబిన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక శతాబ్దానికి పైగా సాగిన అనుబంధం, 19 ఏళ్ల అన్వేషణతో సఫలమై ముగిసింది. కుటుంబ బంధాలకు, పూర్వీకులపై ఉన్న మమకారానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.
Reporter
VMToday News